ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్లకు స్థానచలనం

  • మొత్తం 17 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
  •  నరసరావుపేట, కర్నూలుకు కొత్త మున్సిపల్ కమిషనర్లు
  •  విశాఖ, గుంటూరు కార్పొరేషన్లలోనూ కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన శాఖలో భారీగా మార్పులు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న 17 మంది అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెం. 414) జారీ చేసింది. పరిపాలనాపరమైన కారణాలతో ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

ఈ బదిలీల్లో భాగంగా పలువురు కీలక అధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్‌గా ఉన్న బి. రమ్య కీర్తనను నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (దక్షిణం) జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడిని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా బదిలీ చేశారు. గుంటూరు అదనపు కమిషనర్‌గా ఉన్న సిహెచ్. ఓబులేసును కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుత కర్నూలు కమిషనర్ విశ్వనాథ్‌ను బదిలీ చేసి, తదుపరి పోస్టింగ్ కోసం మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా, ఉయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉన్న జె. రామారావును తెనాలి అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ చేశారు. పులివెందుల మున్సిపాలిటీకి ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా ఉన్న సి. ముని కుమార్‌ను అక్కడే రెగ్యులర్ కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చాలాకాలంగా పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న కొందరు అధికారులకు ఈ బదిలీల్లో స్థానం కల్పించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

AP Municipal Commissioners
Andhra Pradesh
Municipal Transfers
Guntur Municipal Corporation
Kurnool Municipal Corporation
Vijayawada Municipal Corporation
Visakhapatnam Municipal Corporation
Municipal Administration
S Suresh Kumar

More Telugu News